18-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 18: నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గురువారం నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ప్లెక్సీల వార్ చోటుచేసుకుంది. రామారావు వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈరోజు ఉదయం బాలకృష్ణ నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు.
తర్వాత అక్కడి నుంచి బాలకృష్ణ వెళ్లగానే ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను తొలగించారు. బాలయ్య ఆదేశాలతోనే ఆ ప్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ, తారక్ ను దూరం పెడుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, బాలకృష్ణ కంటే ముందే తెల్లవారుజామున తారక్, కళ్యాణ్ రామ్లు కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన బాబాయ్ నందమూరి బాలకృష్ణ మధ్య గ్యాప్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆ ప్రచారానికి బలం చేకూర్చే ఘటన చోటు చేసుకుంది. మరోవైపు అక్కడికి తారక్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలకృష్ణ అతడి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి చేరుకున్నారు. ఆయన తన తండ్రికి అంజలి ఘటించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. బాలకృష్ణ వెళ్లిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తారక్ ప్లెక్సీలను బాలయ్య అభిమానులు తొలగించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది.
బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలిగించారనే ప్రచారం జరుగుతోంది. వాటిని వెంటనే తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.