30-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 30: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో చివరి బడ్జెట్ సమావేశం మొదలవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెడతారు. ఏప్రిల్-మే నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రతిపాదిస్తారు.
ఎన్నికల నేపథ్యంలో విధానపర ప్రకటనలు ఏమి ఉండకపోవచ్చు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు పార్లమెంట్ ఆమోదం తెలిపితే ఏప్రిల్- జులైకి కావాల్సిన నిధులను ప్రో రేటు ప్రాతిపదికన భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం 2024-25 ఏడాదికి జూన్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ క్రమంలో కొత్త పథకాలు లేదా విధానాలు ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికమంత్రిగా వరసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పిస్తున్నారు. ఐదు సార్లు పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించారు.
ఈ సారి ఓటాన్ అకౌంట్ బ్జడెట్ ప్రతిపాదిస్తారు. వరసగా ఆరోసారి బ్జడెట్ సమర్పించిన మహిళ నేతగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అత్యధికంగా పది సార్లు బ్జడెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్థానంలో నిర్మలా సీతారామన్ నిలుస్తారు. అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హ్మా మన్మోహన్ సింగ్ ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఇందిరా తర్వాత బడ్జెట్ ప్రతిపాదించిన మహిళా నేతగా నిర్మలా సీతారామన్ నిలిచారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2014-15, 2015-16, 2016-2017, 2017-2018, 2018-2019 ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జైట్లీ అనారోగ్యానికి గురికావడంతో 2019-2020 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం పీయూష్ గోయల్ కు వచ్చింది. 2019లో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది.
జైట్లీ సూచనలతో నిర్మలా సీతారామను ప్రధాని మోదీ ఆర్థిక శాఖ బాధ్యతలను ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా వరసగాబడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం వచ్చింది. రెండో అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా రికార్డు సృష్టించారు. తన బడ్జెట్లో సంస్కరణలకే నిర్మలా సీతారామన్ ప్రాధాన్యం ఇచ్చారు. సూట్ కేసులా కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే సంప్రదాయానికి నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు.
ఓట్ ఆన్ అకౌంట్ బ్జడెట్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని 50 శాతం పెంచే అవకాశం ఉంది. కిసాన్ సన్మాన్ పథకం ద్వారా భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేల పంట సాయాన్ని మూడు విడతలుగా అందిస్తున్నారు. ఇప్పుడు దానిని రూ.9 వేలకు పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వంపై రూ.12 వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ తదితర విషయాల్లో పాతపద్ధతినే అవలంబించే ఛాన్స్ ఉంది.