02-07-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూలై 2: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు.. రాహుల్ గాంధీ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వానికి జవాబుదారీగా, ప్రజల గొంతుకుగా ఉండే ప్రతిపక్ష నేత.. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.. నాడు వాజ్పేయి, అద్వానీ, సుష్మా స్వరాజ్ లాంటి దిగ్గజాలు ఈ ప్రతిపక్ష నేత పాత్రను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తే.. నేడు అందుకు విరుద్ధంగా రాహుల్ గాంధీ వ్యవహరించారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన తొలి ప్రసంగంలో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. లోక్సభ వేదికగా రాహుల్ గాంధీ హిందువులపై విద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసి.. ఆయనకు హిందూ సమాజంపై ఉన్న వ్యతిరేకతను మరోసారి తన వ్యాఖ్యల్లో రుజువు చేసుకున్నారన్నారు.
ప్రధాని మోదీతో పాటు బీజేపీ పార్టీపై ఉన్న ద్వేషాన్ని రాహుల్ గాంధీ మరోమారు చూపించారన్నారు. హిందువులను అవమానించడం ఇండియా కూటమికి ఇదేం కొత్తకాదని.. గతంలోనూ కాంగ్రెస్, ఆ పార్టీలోని కూటమి సభ్యులు పలుసార్లు హిందూ సమాజంతో పాటు సనాతన ధర్మాన్ని సైతం అవమానించారని కిషన్ రెడ్డి చెప్పారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందువులను శిక్షించే విధంగా మత హింస బిల్లును రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని గుర్తు చేశారు. కాగా, లోక్సభలో హిందువులపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన రాహుల్ గాంధీ.. మొత్తం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.